Skip to main content

గాలి మేడలు

         నేను సివిల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ..బోలెడన్ని కలలు కనేవాడిని.

నా టాలెంట్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని...లక్ష జీతం...బంగ్లా...కారు ఇస్తారు అన్నవి ఆ కలలు.

        అయితే డిగ్రీ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వాస్తవాలు తెలియడం మొదలు అయింది.

      ఎక్కడికి వెళ్ళినా పది..పన్నెండు వేలు జీతం ఇస్తామన్న వారేగాని..నా టాలెంట్ కి తగ్గ జీతం ఇచ్చే వాళ్లు తారసపడలేదు.

      కూలీ పనులు చేసేవారికి కూడా రోజుకు కనీసం అయిదు వందలు ఇస్తున్నారు.అంటే నెలకు పదిహేను వేలు.అటువంటిది ఒక ఇంజినీర్ కి పది వేల జీతం నాకు అవమానకరంగా అనిపించింది.

       అందుకే కనీసం యాభై వేలు ఇవ్వనిదే ఉద్యోగంలో చేర రాదని నిర్ణయం తీసుకున్నాను.

        అలా రెండేళ్లుగడిచిపోయాయి.ఇప్పుడు ఇంటర్ వ్యూ కి వెళ్తే రెండేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నావని అడుగుతూ రిజెక్ట్ చేయసాగారు.

          ఇప్పుడు నేను పాతిక వేల జీతానికి సిద్ధపడ్డాను. అయితే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు కూడా గగనమయ్యారు.

        ఇంటి దగ్గర నాన్న మునుపటిలా కాక నా మీద విసుక్కుంటున్నాడు.నా నిర్ణయాలు తప్పు పడుతున్నాడు. "ముందు ఏదో ఒక జాబ్ లో చేరిపోయి తరువాత మరొక దానికి ప్రయత్నం చేయమనేది నాన్న వాదన. ఆ చేరేదేదో కొంచెం ఆలస్యం అయినా మంచి కంపెనీలో చేరాలన్నది నా తాపత్రయం.

        ఒక రోజు నాన్న " నా స్నేహితుడు ఒకడు హైదరాబాద్ లో జాబ్ చూసాడు. పదిహేను వేలు ఇస్తారట.వెళ్లి జాయిన్ అవు" అని సీరియస్ గా చెప్పాడు.

     కూలీ వాడు నెలకు తేలిగ్గా పది హేను వేలు సంపాదిస్తున్నాడు. ఆ ముష్టి పదిహేను వేలకు నేను ఉద్యోగం చేయను అని నాన్నకుఖచ్చితంగా చెప్పేశాను.

    అప్పుడు నాన్న కూడా ఒక మాట ఖచ్చితంగా చెప్పేశాడు. "నాకు సంతానం నీవు ఒక్కడివే కాదు. ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళను చదివించాలి.డిగ్రీ పూర్తి చేసి కూడా 

ఉద్యోగం చూసుకో లేకపోయిన  నిన్ను ఇంకా పెంచి పోషించడం నా వల్ల కాదు".

        నాన్న అంత మాట అన్నాక మరిక ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్ వచ్చేసాను.

     వచ్చి ఒక ఫ్రెండ్ రూంలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను.ఒకరు పదివేల జీతం ఆఫర్ చేస్తే మరొకరు ఎనిమిది వేలు.ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మెల్లగా బోధ పడసాగింది.

      వారం గడిచేసరికి నాకు రూంలో షెల్టర్ ఇచ్చిన ఫ్రెండ్ ముఖ కవళికలు మారసాగాయి. అది గమనించిన నాకు చాలా ఇబ్బందిగా అనిపించ సాగింది. కానీ మరో చోటకు మారలేని పరిస్తితి. నెల రోజులు గడిచాయి.తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి.ఫ్రెండ్ ను అడగాలంటే భయం వేసింది. నా బ్యాగ్ బయటకు విసిరి ఖచ్చితంగా పొమ్మనగలడు.

          కడుపులో భయంకరంగా ఆకలి. మా ఇంటికి వెళ్లి పోవాలనిపించింది. కానీ పౌరుషం అడ్డు వచ్చింది. సాయి బాబా గుడి దగ్గర నిత్య అన్న దానం జరుగుతుందని ఎవరో చెప్పుకుంటూ ఉంటే విన్నాను. రెండు రోజుల నుంచి అక్కడకు వెళ్లి కడుపు నింపుకుంటున్నాను.

     ఈరోజు ఒక చోట ఇంటర్వ్యూ ఉంటే వచ్చాను. ఉదయం వచ్చాను. మధ్యాహ్నం అయింది. వెయిట్ చేయమన్నారు గాని లోనికి పిలవడం లేదు. పైగా నిలబడే షెల్టర్ కూడా లేదు. బయట ఎండ విపరీతంగా ఉంది. చెమటలు కారిపోతున్నాయి. కడుపులో భయంకరమైన ఆకలి. సాయి బాబా గుడికి వెళ్ళి ఉచిత భోజనం చేసి వద్దామంటే అది ఇక్కడకు చాలా దూరం. పైగా ఇంటర్వ్యూ కి పిలిస్తేఇబ్బంది.

        అలానే నిస్సహాయంగా ఎండలో నిలబడి పోయాను. ఇంజనీరింగ్ చేసేటప్పడునేను కన్న కలలు గుర్తు కొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

       నేను నిలబడిన చోటికి కొంచెం దూరంలో ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. ఉదయం నుంచి కూలీలు పని చేస్తున్నారు. మధ్యాహ్నం కావడంతో వాళ్ళు పనులు ఆపి తెచ్చుకున్న టిఫిన్ క్యారియర్లు తెరిచి భోజనాలు చేయసాగారు. ఆ వాసనలు దగ్గరకు వచ్చి నా ఆకలిని మరింత రగిలించాయి. ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు అయినా అమృతమే!

            కొంచెం సేపు తరువాత ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. వయసు ఇరవై లోపే! వేషధారణ బట్టి అక్కడ పని చెసే కూలీ అని అర్థం చేసుకున్నాను.

     ఆ అమ్మాయి " అన్నా! ఉదయం నుంచీ చూస్తున్నా! ఈడనే ఎండన బడి ఉన్నావు. ఎంగిలి కూడా పడినట్లు లేవు. రా అన్నా! మాతో పాటు కాస్త తిందువు!" అన్నది.

లోకంలో  మానవత్వం ఇంకా మిగిలి ఉన్నట్లు అనిపించింది.

       " వద్దు" అన్నాను."ఏం అన్నా! రానంటున్నవు? నేను కూలి దాన్ని అనా?" అందా అమ్మాయి. దెబ్బ తిన్న పక్షిలా ఆ అమ్మాయి వంక బాధగా చూసి"అది కాదు. నాకు పెడితే నీకు సగం కడుపే నిండుతుంది!"అన్నాను. "పస్తు కన్నా అది నయం కదా!" అన్నది.

      మౌనంగా తనను అనుసరించాను.

మధ్యలో " నీ పేరు" అని అడిగాను." మల్లిక. అందరూ మల్లీ!అంటారు" అని చెప్పింది.

         టిఫిన్ తెరిచింది. గుప్పున గోంగూర పచ్చడి వాసన వచ్చింది. నా కడుపులోని ఆకలి విజృంభించింది. మల్లి సగం అన్నం మూతలో పెట్టుకొని తను తీసుకుంది.

టిఫిన్ బాక్స్ లోని అన్నం నాకు అందించింది. ముద్ద నోట్లో పెట్టుకుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కారంతో కాదు. ఆమె మమకారంతో. "అన్నా! ఈడ ఇంటర్వ్యూ కి వచ్చావా? అని అడిగింది మల్లిక. "అవును. నీకు ఎలా తెలుసు?" అని అడిగాను. " అది ఇక్కడ ఎప్పుడూ జరిగే తతంగమే! సెలక్ట్ చేసిన వాళ్ళను మా సైట్ కే పంపిస్తారు" అని చెప్పింది మల్లిక.

       ఆ అమ్మాయి ఇంగ్లీష్ పదాలు చక్కగా పలకడం గమనించి" ఏం చదివావు?" అని అడిగాను.

       "యైత్ క్లాస్" అని చెప్పింది మల్లిక.

తనే కొంచెం సేపాగి " మరిక చదివించే తాహతు లేక అయ్య కూలి పనికి పంపడం మొదలెట్టాడు.ఈ మద్దెనే మనువు జరిగింది. ఆడూ ఈడే ఏడో కూలి పని చేత్తున్నాడు" చెప్పింది మల్లిక.

     అన్నం తినడం పూర్తి అయింది. చెయ్యి కడుక్కుంటూ "గోంగూర పచ్చడి చాలా బాగుంది" అని చెప్పాను.మల్లిక చిన్నగా నవ్వింది.

      నేను తనకు థాంక్స్ చెప్పి బయలు దేరాను.అప్పుడు మల్లిక " అన్నా! ఒక మాట చెబుతాను.ఏం అనుకోకు" అన్నది. నేను వెళ్ళేవాడిని ఆగి " చెప్పు అన్నాను.

"ఈడ పెద్ద జీతం ఇవ్వరు అన్నా! చాలా మంది కుర్రోళ్ళు వచ్చి జీతం తక్కువ అని వెళ్లి పోతూ ఉంటారు. నా మనసులోని మాట చెబుతున్నా. మీలాం టోల్లు గాలిలొ మేడలు కడుతూ ఉంటారు. ఇటుక మీద ఇటుక పేరిస్తేనే ఇల్లు అవుతుందన్న విషయం మరచి పోతుంటారు. నీవూ అదే తప్పు చేయకు" అన్నది.

    కూలీ పని చేసుకునే ఒక అమ్మాయి ఎద లోతుల్లో అంతటి జీవన సత్యం దాగి ఉంటుందని నేను ఊహించలేదు.

ఆ అమ్మాయి మాటకు నాకు నోట మాట రాలేదు. అంతేకాదు...జ్ఞాన నేత్రం తెరుచు కుంది.

      "అలాగే!" అని వెను తిరిగాను. ఇంటర్ వ్యూ అయింది. "పన్నెండు వేలు జీతం" అని చెప్పారు. నేను తట పటాయించకుండా నా సమ్మతి తెలిపాను. మరునాడు ఉద్యోగంలో చేరుతూ వెదుక్కుంటూ వెళ్లి మల్లికకు స్వీట్స్ ప్యాకెట్ అందించాను.

         మల్లిక చెప్పిన జీవిత సత్యం వమ్ము కాలేదు. ఇటుక మీద ఇటుక పేరు స్తూ నేను మొదలు పెట్టిన ప్రయాణం త్వరలోనే గొప్ప భవంతిగా రూపు దిద్దుకున్నది!!

....ఎన్.శివ నాగేశ్వర రావు

Comments

  1. Nice inspiration to so many young people who are thinking about their future irrespective of constructional road map of future.

    ReplyDelete
  2. చదువుతూ వెళుతున్నా.. మల్లి దగ్గరకు వచ్చేసరికి కన్నీటి పొర కమ్మేసింది!

    ReplyDelete
  3. నిజంగానే జ్ఞాననేత్రం తెరుచుకుంది........

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అనుచిత వ్యాఖ్యలు తగవు!

  అనుచిత వ్యాఖ్యలు తగవు! ఈరోజు దేశంలో ఏ పౌరుడిని పలకరించినా వారి నోటి నుంచి వచ్చే మాట పహల్గాం ఉగ్రదాడికి భారతదేశం ఇచ్చే జవాబు ఏమిటి? మనం ఏవిధంగా బదులు తీర్చుకోబోతున్నాం అని. దీనికి అనుగుణంగానే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక త్రివిధ దళాలు తమ కార్యాచరణ తాము చేస్తున్నాయి. భారతదేశ పౌరులుగా పూర్తి విశ్వాసముతో ఓపికగా ఎదురు చూడవలసిన సమయం ఇది. ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ఏమరుపాటుతో కూడా  అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రధాని పట్ల, త్రివిధ దళాల పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది.  సామజిక సేవలో (రాజకీయ, స్వచ్చంద సంస్థలు) ఉన్న చాలా మంది కూడా నేడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దేశం మరియు ప్రధాని పట్ల వ్యతిరేకమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఈ వ్యతిరేక వార్తలు కూడా ఒక వ్యూహంతో ప్రజలను అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే చెప్పవచ్చు. మరేమిటి ఆ అసలు సమస్య.? ఒకసారి కొన్ని ఘటనలను గుర్తు చేసుకుందాం..! బెంగళూరులో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని అవమానిస్తే స్థానిక...

సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు

 సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో.  వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని  పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు.    చాకివాడు                  =       వస్త్రాన్ని చీకాకు పడజేసి           =     బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు      ...